Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసు... హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

Relief to Harish Rao in TG High Court
  • తన ఫోన్ ట్యాప్ చేశారని పంజాగుట్ట పీఎస్‌లో చక్రధర్ ఫిర్యాదు
  • హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హరీశ్ రావు
  • తదుపరి విచారణ చేపట్టే వరకు దర్యాఫ్తుపై స్టే విధించిన హైకోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాఫ్తుపై హైకోర్టు ఈరోజు స్టే విధించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు స్పష్టం చేసింది.

తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను అరెస్టు చేశారు. అతను హరీశ్ రావు వద్ద గతంలో పని చేశాడు. 

తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

మరోవైపు, ప్రభుత్వం తరఫున వాదనల కోసం లాయర్ సిద్ధార్థ లూథ్రా వస్తారని పీపీ కోర్టుకు తెలిపారు. లూథ్రా మరో కేసులో బిజీగా ఉన్నందున సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement
Harish Rao
Telangana
BRS
Congress

More Telugu News