Andhra Pradesh: మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

Andhra pradesh CM Chandrababu Praises Minister Nara Lokesh In Collectors Meeting
  • లోకేశ్ కృషి వల్లే గూగుల్ తో ఒప్పందం కుదిరిందని వెల్లడి
  • సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగం
  • సంక్షోభంలోనూ అవకాశాలు వెతికి పట్టుకోవాలని కలెక్టర్లకు సూచన
ప్రయత్నాలు మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు రావని, నిరంతర ప్రయత్నాలతోనే ఫలితాలను రాబట్టుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ నిరంతర ప్రయత్నం, కృషి వల్లే గూగుల్ కంపెనీతో ఎంవోయూ కుదిరిందని వివరించారు. ఈమేరకు ఏపీ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేశ్ ను చంద్రబాబు మెచ్చుకున్నారు. 

గూగుల్ కంపెనీ ఏర్పాటుకు కుదిరిన ఎంవోయూతో విశాఖలో అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని చెప్పారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణం అని అన్నారు. హార్డ్‌ వర్క్‌ ముఖ్యం కాదు... స్మార్ట్‌ వర్క్‌ కావాలని చెప్పారు. ప్రజాచైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక పాలసీలతో ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని వివరించారు. కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోందని తెలిపారు. గూగుల్ కంపెనీతో ఎంవోయూ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో అమరావతిలో భేటీ అయినట్లు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలీ నేతృత్వంలో గూగుల్ ప్రతినిధి బృందం తనను కలిసిందన్నారు. భారత్ లో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వారు తనకు వివరించారని, దేశంలోని వివిధ రాష్ట్రాలను కాదని ఏపీతో గూగుల్ ఒప్పందం కుదుర్చోవడం గర్వంగా ఉందని చెప్పారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra Pradesh
CM Chandrababu
Nara Lokesh
Google Company
Google MoU
Collectors Meet
AP Secretariat

More Telugu News