ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అప్పట్లో నాసిరకం ల్యాప్ టాప్ లు ఇచ్చారు.. వైసీపీపై లోకేశ్ ఫైర్

AP Minister Nara Lokesh Speech In legislative council
  • 1520 ల్యాప్ టాప్ లలో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు
  • 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి దోషులను శిక్షిస్తాం
  • శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్
వైసీపీ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శాసన మండలిలో పేర్కొన్నారు. విద్యార్థులకు అందజేసిన వాటిలో 1,520 ల్యాప్ టాప్ లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. నాసిరకం ల్యాప్ టాప్ ల పంపిణీ ఆరోపణలపై 90 రోజుల్లో విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈమేరకు మండలిలో గురువారం ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, దువ్వారపు రామారావు, కంచర్ల శ్రీకాంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ జవాబిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. 

ఆర్జీయూకేటీ(ఐఐఐటీ) విద్యార్థులకు అందించేందుకు 2023 లో అప్పటి వైసీపీ సర్కారు ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా 6,500 ల్యాప్ టాప్ లు కొనుగోలు చేసింది. ఒక్కో ల్యాప్ టాప్ కు ప్రభుత్వం రూ.27వేలు వెచ్చించింది. అయితే, ఇందులో 1,520 ల్యాప్ టాప్ లలో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కనీసం ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్ స్టాల్ చేయలేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. బేసిక్ అడాప్టర్ లు కూడా పనిచేయని పరిస్థితి. కొన్నింట్లో ఆడియో క్వాలిటీల్లో ఇబ్బందులు ఉన్నాయి. బ్యాటరీలు కూడా నాసిరకంగా ఉన్నాయి. కొన్ని ల్యాప్ టాప్ లు అసలు ఆన్ కూడా కాలేదని విద్యార్థులు ఫిర్యాదులు చేశారని లోకేశ్ తెలిపారు.
Go Back to Shorts
Nara Lokesh
AP Legislative Council
IIIT
Students
Laptops
YCP Govt

More Telugu News