ఆ విషయాలు బయటపెట్టాలా... నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారు: అసదుద్దీన్ హెచ్చరిక

Asaduddin Owaisi fires at brs leaders
  • మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ ప్రణాళికలు వేయలేదా అని నిలదీత
  • తమ వల్లే జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని వ్యాఖ్య
  • ఎక్కువ సంతానం ఉండాలని చంద్రబాబు, స్టాలిన్ చెప్పారన్న అసద్
  • ఇదే మాట తాను చెబితే రాద్దాంతం చేస్తారని మండిపాటు
నాటి విషయాలన్నీ (బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు) నేను ఇప్పుడు బయటపెట్టాలా? తాను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన కోసం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రణాళికలు వేయలేదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 

మూసీపై బీఆర్ఎస్ ప్రణాళిక చేస్తే తాను వద్దని కూడా చెప్పానని వెల్లడించారు. ఆనాటి విషయాలు ఇప్పుడు బయటకు చెప్పమంటారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. నేను నోరు విప్పితే ఇబ్బంది పడేది బీఆర్ఎస్ నాయకులే అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తామూ స్వాగతిస్తామన్నారు.

బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని హితవు పలికారు. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి తామే కారణమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. మజ్లిస్ మద్దతు కారణంగానే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో కేవలం 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని జోస్యం చెప్పారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు అహంకారం ఉందని విమర్శించారు.

చంద్రబాబు, స్టాలిన్ అదే చెప్పారు

ఎక్కువ మంది సంతానం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ చెబుతున్నారని అసదుద్దీన్ పేర్కొన్నారు. కానీ అదే విషయాన్ని తాను చెబితే మాత్రం రాద్ధాంతం చేసేవారన్నారు. దక్షిణ భారతదేశంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని అభిప్రాయపడ్డారు.

జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు. బాగా పని చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభమని మండిపడ్డారు.
Go Back to Shorts
Asaduddin Owaisi
Revanth Reddy
Congress
BRS

More Telugu News