జన్వాడ ఫామ్‌హౌస్ ఓనర్‌తో రేవంత్‌రెడ్డి కుమ్మక్కు కాకపోయి ఉంటే కనుక.. రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు

Raghunandan Rao on Janwada farm house issue
  • డీజీపీ మధ్యాహ్నమే ప్రెస్‌మీట్ పెట్టి ఫుటేజీ సహా వివరాలు వెల్లడించాలన్న బీజేపీ ఎంపీ
  • జన్వాడ ఫామ్‌హౌస్‌పై సీఎం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్య
  • రేవంత్, కేటీఆర్ రాజీపడినట్టుగా ప్రచారం సాగుతోందని విమర్శ
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్‌హౌస్ యజమానితో కుమ్మక్కు కాకపోయి ఉంటే డీజీపీ ఈరోజు మధ్యాహ్నమే ప్రెస్‌మీట్ పెట్టి ఎస్‌వోటీ పోలీసులు రైడ్ సమయంలో ఫామ్‌హౌస్ లోపల, చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో జన్వాడ ఫామ్ హౌస్‌పై సీఎం ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి, కేటీఆర్ రాజీపడినట్టుగా ప్రచారం సాగుతోందని రఘునందన్‌రావు తెలిపారు. అక్కడ జరిగింది రేవ్ పార్టీయా? డ్రగ్ పార్టీయా? ఫారిన్ లిక్కర్ ఉందా? తెలియాల్సి ఉందన్నారు. రాజ్ పాకాలకు సంబంధించిన ఫామ్‌హౌస్ ఫుటేజీని బయట పెట్టాలని కోరారు. ఆలస్యం అయితే కనుక ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలవుతాయని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్య నాయకులు, వారి పిల్లలను బయటకు పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తోందన్నారు.

డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సిట్ దర్యాఫ్తు జరగాలని డిమాండ్ చేశారు. ఓ వైపు డ్రగ్స్ రహిత తెలంగాణగా చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, కానీ వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్ చుట్టూ రేవ్ పార్టీలు, రావుల పార్టీలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాజులు, యువరాజులు కూర్చొని విదేశీ మాదకద్రవ్యాలతో పాటు కొకైన్ వంటి డ్రగ్స్ తీసుకున్నారన్నారని రఘునందన్‌రావు ఆరోపించారు.​​​​​
Advertisement
Raghunandan Rao
BJP
KTR
Telangana
Drugs Case

More Telugu News