Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ.. ఏకైక‌ క్రికెటర్‌గా అరుదైన ఘ‌న‌త‌!

Virat Kohli Shatters Sachin Tendulkar Record Becomes First Cricketer Ever To
షార్ట్స్‌లో చూడండి
కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న‌ రెండో టెస్టులో భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత్యంత వేగంగా 27వేల‌ అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. కేవలం 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని సాధించాడు. త‌ద్వారా భారత దిగ్గజం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ ఫీట్‌ను అందుకోవ‌డానికి స‌చిన్ 623 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

దీంతో 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇక ఈ ఘనత సాధించిన ఇతర ఆటగాళ్ల‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర ఉన్నారు.

అత్యంత వేగంగా 27వేల‌ అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయ‌ర్లు 
594 ఇన్నింగ్స్‌లు - విరాట్ కోహ్లీ
623 ఇన్నింగ్స్‌లు - సచిన్ టెండూల్కర్
648 ఇన్నింగ్స్‌లు - కుమార సంగక్కర
650 ఇన్నింగ్స్‌లు - రికీ పాంటింగ్

ఇదిలాఉంటే.. రెండో టెస్టులో దాదాపు రెండున్న‌ర రోజుల ఆట వ‌ర్షార్ప‌ర‌ణం కావ‌డంతో టీమిండియా త‌న వ్యూహాన్ని మార్చింది. నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆడి డిక్లేర్‌ చేసింది. 

బంగ్లాదేశ్‌ను 233 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత భార‌త‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ అటాకింగ్ క్రికెట్ ఆడారు. దీంతో కేవ‌లం 3 ఓవ‌ర్ల‌లోనే భార‌త్ స్కోర్ 50 ప‌రుగులు దాటింది. దాంతో టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ బంతుల్లోనే 50 ప‌రుగులు పూర్తి చేసిన జ‌ట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. 

చివ‌రికి 34.4 ఓవర్లలో రోహిత్ సేన‌ 285/9 పరుగుల వ‌ద్ద డిక్లేర్‌ చేసింది. 4వ రోజు చివరి సెషన్‌లో 52 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 2 వికెట్లు కోల్పోయి 26 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్ గెల‌వ‌డం ద్వారా భార‌త్ ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో త‌న స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవాల‌ని చూస్తోంది. 

ప్రస్తుతం టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) పాయింట్ల‌ పట్టికలో అగ్ర‌స్థానంలో ఉంది. ఒక‌వేళ బంగ్లాదేశ్‌పై 2-0తో సిరీస్ గెలిస్తే భార‌త స్థానాన్ని మరింత బలపరుస్తుంది. మూడోసారి ఫైన‌ల్ వెళ్లేందుకు మార్గం సుగ‌మమవుతోంది.

అయితే, కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగిస్తే మాత్రం డ‌బ్ల్యూటీసీలో భాగంగా ఫైన‌ల్‌కు చేరాలంటే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లలో భార‌త్ క‌నీసం ఐదు టెస్టులను గెల‌వాల్సి ఉంటుంది.

బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత రోహిత్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌ర్వాత ఐదు టెస్టుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్ల‌నుంది.
Go Back to Shorts
Virat Kohli
Sachin Tendulkar
Team India
Cricket
Sports News

More Telugu News