తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని యూపీ, బీహార్ లా మార్చేస్తున్నారు: పేర్ని నాని

Perni Nani fires on TDP leaders
  • ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల ఉద్రిక్తతలు
  • ప్రెస్ మీట్ పెట్టిన పేర్ని నాని, కొడాలి నాని
  • టీడీపీ శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతున్నాయన్న పేర్ని నాని
  • సీఐలను, డీఎస్పీలను కూడా బెదిరిస్తున్నారని ఆరోపణ
  • వీడియోలను హైకోర్టుకు సమర్పిస్తామని వెల్లడి
ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు ప్రాంతాల్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ విధ్వంసాలకు, మారణహోమానికి పాల్పడుతోందని పేర్ని నాని మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హింసను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. 

వారి కార్యకర్తలు చేసే విధ్వంసకాండపై కేసులు నమోదు చేయవద్దని, పోలీసులు జోక్యం చేసుకోవద్దని పైనుంచి చంద్రబాబు డీజీపీ, ఎస్పీలకు చెబుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. గతంలో యూపీ, బీహార్ రాష్ట్రాలు ఎలా ఉండేవో, ఇప్పుడు ఏపీని కూడా తండ్రీకొడుకులు హింసాత్మక రాష్ట్రంగా తయారుచేస్తున్నారని విమర్శించారు. 

మర్డర్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారు, రౌడీషీటర్లు కూడా స్థానిక సీఐలను, డీఎస్పీలను బెదిరించే పరిస్థితి వచ్చిందని... ఏరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావా నువ్విక్కడ? అంటూ మాట్లాడుతున్నారని, దీనికి సంబంధించి తమ వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ వీడియో ఆధారాలను హైకోర్టుకు ఇవ్వబోతున్నామని అన్నారు.
Go Back to Shorts
Perni Nani
Kodali Nani
Chandrababu
Nara Lokesh
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News