Pandya: పాండ్యా వెళ్లిపోయినా గుజరాత్ జట్టుకు నష్టం లేదు: మహ్మద్ షమీ

Mohammed Shamis Blunt Verdict On Hardik Pandya Leaving Gujarat Titans
  • వచ్చే సీజన్ లో ముంబై జట్టుకు ఆడనున్న హార్థిక్ పాండ్యా
  • గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం
  • ఓసారి జట్టుకు ఐపీఎల్ ట్రోపీ అందించిన పాండ్యా
హార్థిక్ పాండ్యా వెళ్లిపోవడం వల్ల గుజరాత్ జట్టుపై ఎలాంటి ప్రభావం పడదని మహ్మద్ షమీ అన్నాడు. జట్టులో నుంచి ఎవరు వెళ్లినా పెద్దగా ప్రభావం ఉండదని చెప్పాడు. ఐపీఎల్ లో ఒకే జట్టుకు ఆడతామంటూ ఏ ఆటగాడూ కాంట్రాక్ట్ రాసివ్వలేదని అన్నాడు. ఈమేరకు తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు శుభ్ మన్ గిల్ కు అప్పగించిన విషయం తెలిసిందే.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘నిజమే.. పాండ్యా మమ్మల్ని చాలా బాగా లీడ్ చేశాడు. జట్టును బాగా నడిపించి రెండు సీజన్లలో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. అందులో ఓసారి ట్రోఫీని గెల్చుకున్నాం. ఇవన్నీ నిజమే.. అయితే, ఐపీఎల్ లో ప్రతీ సీజన్ కూ ఆటగాళ్లు వివిధ టీమ్ లు మారుతుంటారు. ఏ ఆటగాడూ ఫలానా టీమ్ కే జీవితాంతం ఆడతానని కాంట్రాక్ట్ రాసివ్వలేదు. అలా మారినంత మాత్రానా ఆయా జట్టులపై ప్రభావం పెద్దగా ఉంటుందని అనుకోలేం. గత సీజన్ వరకు పాండ్యా మా కెప్టెన్. ఇప్పుడు గిల్ ఆ బాధ్యత తీసుకున్నాడు. గిల్ కూడా జట్టును బాగా నడిపిస్తాడు. ఆయనకూ అనుభవం వస్తుంది’ అని షమీ పేర్కొన్నాడు. కాగా, గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్థిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. రెండు సార్లు జట్టును ఫైనల్ చేర్చగా.. ఒకసారి జట్టుకు ట్రోపీని అందించాడు.
Pandya
Shami
IPL
Gujarat Titans
Mumbai Indians
IPL 2024

More Telugu News