రేపు పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అల్పాహార విందు
- రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం
- విజయవాడలో మకాం వేసిన సీఈసీ కమిటీ
- రేపు ఉదయం 8.30 గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి పవన్
- నోవోటెల్ హోటల్లో సీఈసీ బృందాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్
పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రేపు ఉదయం విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 8.30 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళతారు. చంద్రబాబు నివాసంలో జనసేనాని అల్పాహార విందు స్వీకరిస్తారు. అనంతరం, చంద్రబాబు, పవన్ విజయవాడలో సీఈసీ కమిటీ సభ్యులను కలిసేందుకు బయల్దేరతారు.
రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను చంద్రబాబు, పవన్ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు.
ఓట్ల అవకతవకలపై చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఓసారి సీఈసీని కలిశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి సీఈసీతో భేటీ కానుండడం ఇదే ప్రథమం. రేపు విజయవాడ నోవోటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలవనున్నారు.