Advertisement

యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించేలా చర్యలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TSPSC like UPPSC says Uttam Kumar Reddy
  • నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం విఫలమైందన్న ఉత్తమ్  
  • పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాను అడిగినట్లు చెప్పిన మంత్రి
  • హోదా ఇవ్వలేమని... 60 శాతం నిధులు ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడి
నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. యూపీపీఎస్సీ చైర్మన్‌ను రేపు ఉదయం 11 గంటలకు కలవనున్నామని... యూనియన్ పబ్లిక్ కమిషన్ తరహాలో పనిచేసేలా టీఎస్పీఎస్సీని రూపొందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను కోరినట్లు తెలిపారు. 90 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1200 గ్రామాలకు మంచినీరు, 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చునని వెల్లడించారు. జాతీయ హోదా ఇస్తూ 60 శాతం వ్యయం కేంద్రం భరించాలని కోరినట్లు తెలిపారు.

అయితే సుదీర్ఘ చర్చల అనంతరం, ప్రస్తుతం ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వడం లేదని కేంద్రమంత్రి చెప్పినట్లు వెల్లడించారు. ఇతర స్కీముల కింద 60 శాతం నిధులు ఇస్తామని మాత్రం హామీ ఇచ్చారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40 శాతం ఖర్చు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అరవై శాతం సహకారానికి ముందుకు వచ్చిందన్నారు.
Advertisement
Uttam Kumar Reddy
Congress

More Telugu News