‘కోటా’లో మరో విద్యార్థి ఆత్మహత్య

another student commits suicide in Kota
  • నీట్‌ పరీక్షకు శిక్షణ తీసుకుంటున్న యూపీ విద్యార్థి ప్రియమ్ సింగ్
  • పురుగుల మందు తాగి ఆత్మహత్య
  • కోచింగ్‌ హబ్‌ అయిన రాజస్థాన్ కోటాలో ఈ ఏడాది 26 మంది విద్యార్థుల ఆత్మహత్య
  కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి తనువు చాలించింది. ఉత్తరప్రదేశ్‌ కి చెందిన ప్రియమ్‌ సింగ్‌ అనే 17 ఏళ్ల విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. యూపీలోని మహువా ప్రాంతానికి చెందిన ప్రియమ్‌ సింగ్‌ ఇంటర్‌ పూర్తి చేసింది. వైద్య విద్య అభ్యసించేందుకు కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది. సోమవారం కోచింగ్‌ సెంటర్‌ వద్ద ఆమె వాంతులు చేసుకుంది. దీంతో తోటి విద్యార్థులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె విషం తాగి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 

కానీ, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పరీక్షల ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నారు. కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. రెండు వారాల కిందట కూడా ఓ విద్యార్థి ఇలానే తనువు చాలించాడు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకూ 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. రాజస్థాన్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టినా ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.
Advertisement
Rajasthan
kota
coaching
suicide

More Telugu News