Perni Nani: పదవి కోల్పోయిన వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు: బండి సంజయ్‌పై పేర్ని నాని ధ్వజం

Perni Nani counter to Bandi Sanjay over voter list issue
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో పాటు ఈ మధ్య పదవిపోయిన బండి సంజయ్ కూడా వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బోగస్ ఓట్లను తొలగించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను వైసీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ కలిశారు. 

అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ... డూప్లికేట్, బోగస్, ఇన్వాలిడ్ ఓటర్లు లేకుండా చేయాలని చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిపారు. కానీ ఓటర్ లిస్టులో అక్రమాలు అంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఒక వ్యక్తికి రెండు లేదా మూడు ఓట్లు ఉంటే సరిచేయాలని కోరామన్నారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ ముగ్గురు కూడబలుక్కొని ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని పత్రికల్లో అభూతకల్పనలు రాస్తున్నారన్నారు. దీనికి తోడు తెలంగాణ నుండి పదవి ఊడిపోయిన బండి సంజయ్ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని, ఉత్తరాదిన బీజేపీ చేసినట్లు మేం చేస్తున్నామని ఆయన అనుకుంటున్నాడేమోనని విమర్శించారు.

చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు రామోజీరావు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు అధినేత దృతరాష్ట్రుడు అయిపోయాడా? అన్నారు. పదిహేను రోజులుగా తమపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2019కి ముందు 59 లక్షల ఓట్లు డబుల్ ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రాజధాని అసైన్డ్ భూముల్లో అవినీతి జరిగిందని, చంద్రబాబు అవినీతి కేసులపై సిట్ వేశామని, డొల్ల కంపెనీల నుండి చంద్రబాబుకు ముడుపులు ముట్టాయన్నారు. ప్రజా ధనాన్ని డొల్ల కంపెనీల పేరుతో హవాలా ద్వారా పంపించారన్నారు. ఇన్‌ఫ్రా సంస్థల నుండి ముడుపులు ముట్టినట్లు ఐటీ నోటీసులతో వెలుగులోకి వచ్చిందన్నారు. తాము గతంలో చెప్పినవన్నీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయన్నారు.
Go Back to Shorts
Perni Nani
Chandrababu
Bandi Sanjay
Andhra Pradesh

More Telugu News