Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థపై న్యాయస్థానంలో తేల్చుకుంటాం: పవన్ కల్యాణ్ ​

Pawan Kalyan once again talks about on Volunteer system
  • ఉంగుటూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో పవన్ భేటీ
  • రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అవసరంలేదని స్పష్టీకరణ
  • వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు వాలంటీర్లు ఎవరన్న పవన్
  • జగన్ అనే జలగలు వస్తుంటాయి, పోతుంటాయి అని వ్యాఖ్యలు

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ ఏలూరులో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నేతలు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై త్వరలో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్ వ్యవస్థ తోడ్పాటు అందిస్తోందని ఆరోపించారు. వాలంటీర్లు దైవాంశ సంభూతులని, వారి కాళ్లు కడగాలని అంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు.  

రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనవసరం అని, ఉన్న వ్యవస్థలను బలోపేతం చేయకుండా, అవసరంలేని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని విమర్శించారు. వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు వాలంటీర్లు ఎవరు? అని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ ఉంచుతున్నారు? అని నిలదీశారు. 

వాలంటీర్ల రూపంలో ప్రతి 50 ఇళ్లకు ఒక జగన్ తయారయ్యాడని వ్యాఖ్యానించారు. జగన్ అనే జలగలు వస్తుంటాయి, పోతుంటాయి... జగన్ వంటి వాళ్లు వచ్చినంత కాలం నాలాంటి వాళ్లు వస్తుంటారు అని వివరించారు. 

ముఖ్యమంత్రికి పిండాకూడుకు, పిండివంటకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. తద్దినానికి, అట్లతద్దెకు తేడా తెలియనివాడని, శ్రాద్ధానికి, శ్రావణ శుక్రవారానికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. 'అ'కి 'ఆ'కి తేడా తెలియనివాడు, వరాహికి వారాహికి తేడా తెలియనివాడు... ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి అంటూ పవన్ వ్యంగ్యం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News