బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు అలర్ట్

Deep depression in Bay of Bengal alert for North Andhra
  • అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం 
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక
  • ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రానున్న నాలుగైదు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది.

తీవ్ర అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని అధికారులు సూచించారు.

ఈ అల్పపీడన ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో అతిభారీ వర్షాలు, మధ్య భారతం మీదుగా పయనించి జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఆగస్టు 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటం గమనార్హం.
Advertisement
Bay of Bengal
Deep Depression
North Andhra Rain Alert
IMD Weather Forecast
Fishermen Warning
Southwest Monsoon

More Telugu News