రేపు భోగాపురంలో దిగే తొలి విమానం ఇదే.. ప్రయాణికులకు గిఫ్టులు!

Air India to operate 14 weekly flights from Bhogapuram to Delhi
  • భోగాపురం ఎయిర్‌పోర్టులో మొదలుకానున్న విమాన సర్వీసులు
    హైదరాబాద్ నుంచి తొలి విమానంగా ఇండిగో ఫ్లైట్
    తొలి ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలతో ప్రత్యేక స్వాగతం
    బెంగళూరు నుంచి రెండో విమానంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతూ, భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఈ అర్ధరాత్రి తర్వాత ప్రారంభమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతూ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలిసారిగా ఇక్కడి రన్‌వేపై అడుగుపెట్టనుంది. ఈ అపురూప క్షణంతో ఈ ప్రాంత విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది.

విమానాశ్రయ ప్రారంభోత్సవంలో భాగంగా తొలి విమానంగా ఇండిగోకు చెందిన 6E6408 ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 6:45 గంటలకు భోగాపురంలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే, ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన IX2064 విమానం కూడా ఇక్కడికి చేరుకుంటుంది. ఈ రెండు విమానాల రాకతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభంమవుతాయి. 

ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకు చెక్-ఇన్ హాల్‌లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం, తొలి ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేసి, ఎయిర్‌లైన్స్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోనున్నారు. తొలి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక రీతిలో స్వాగతం పలకనున్నారు. వారికి స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్-ఫ్లైట్ సర్టిఫికెట్లతో కూడిన గూడీ బ్యాగ్‌లను కానుకలుగా అందజేయనున్నారు.

ఇదిలా ఉండగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 20 వరకు హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు.

భోగాపురం నుంచి ఢిల్లీకి 14 విమానాలు

విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు సాగించే ఎయిరిండియా విమాన సర్వీసులన్నీ ఇకపై భోగాపురంలోని నూతన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. ఆగస్టు 17 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఎయిరిండియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి గందరగోళం లేకుండా, పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ కోడ్ VTZనే కొత్త విమానాశ్రయానికి కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

భోగాపురం నుంచి ఢిల్లీకి వారానికి 14 విమాన సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తామని సంస్థ వెల్లడించింది. దీని ద్వారా తమ హబ్స్ మీదుగా కీలకమైన దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులు సులభంగా చేరుకోవచ్చని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల మధ్య విమాన కనెక్టివిటీని మెరుగుపరిచేలా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నగరాలకు పలు రోజువారీ సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ - భోగాపురం మధ్య రోజుకు రెండు విమాన సర్వీసులు నడుస్తాయి. బెంగళూరు - భోగాపురం మధ్య కూడా రోజుకు రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదనంగా సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో మరో రిటర్న్ సర్వీసును కూడా నడపనున్నారు. ప్రస్తుత ఏవియేషన్ టైమ్‌టేబుల్ ప్రకారం, ఈ కొత్త విమాన షెడ్యూల్ అక్టోబర్ 24 వరకు అమల్లో ఉంటుంది.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ కొత్త విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 77,342 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక వసతులు కల్పించారు. ఇందులో 22 సంప్రదాయ చెక్-ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్-బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, అత్యాధునిక బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సౌకర్యాలతో పాటు ఏడు ఏరోబ్రిడ్జ్‌లు ఉన్నాయి.

ఇకపై ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ను రక్షణ, పోలీసు అవసరాలు, వీఐపీల రాకపోకలు, షెడ్యూల్ లేని ప్రత్యేక విమానాల కోసం మాత్రమే వినియోగిస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్‌కు సేవలందించే ఈ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయి.
Advertisement
Air India
Bhogapuram Airport
Visakhapatnam
Delhi flights
Andhra Pradesh aviation
Alluri Sitarama Raju International Airport

More Telugu News