New Delhi: వర్షపు నీటితో తడిసిన విద్యుత్ స్తంభం తాకి మహిళా టీచర్ దుర్మరణం

delhi woman dies of electrocution after accidentally touching electric pole in rain
  • దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన
  • కుటుంబంతో కలిసి చండీఘడ్ వెళ్లేందుకు రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్న మహిళ
  • రోడ్డుపై నిలిచిన వర్షపు నీరును దాటే క్రమంలో కరెంటు స్తంభాన్ని తాకిన వైనం
  • విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన బాధితురాలు
  • మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
వర్షపు నీటితో తడిసిన విద్యుత్ స్తంభాన్ని ప్రమాదవశాత్తూ తాకిన ఓ మహిళా టీచర్ మృత్యువాత పడ్డారు. దేశరాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రియదర్శిని విహార్ ప్రాంతానికి చెందిన సాక్షి అహుజా(34) స్థానికంగా ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త అంకిత్ అహుజా గురుగ్రామ్‌లోని ఓ జపాన్ కంపెనీలో ఇంజినీర్‌గా చేస్తున్నారు. 

కాగా, ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి చండీగఢ్ వెళ్లేందుకు ఆరుగురు కుటుంబసభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ మొదటి గేటు వద్దకు వచ్చారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరును దాటే క్రమంలో పట్టు తప్పడంతో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని తాకి విద్యుదాఘాతానికి గురయ్యారు. కుప్పకూలిపోయిన ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. విద్యుత్ స్తంభం వద్ద ప్లాస్టిక్ తొడుగు లేని వైర్లు కనిపించాయని కొందరు స్థానికులు చెప్పారు.
New Delhi

More Telugu News