Chidambaram: నల్ల డబ్బు దాచుకునేవారికి మాత్రమే ఈ రూ.2000 నోటు ఉపయోగపడింది: చిదంబరం

  • 2016లో రూ.2 వేల నోటు ప్రవేశపెట్టిన కేంద్రం
  • ఏడేళ్ల తర్వాత ఉపసంహరణ
  • రూ.2 వేల నోటు తీసుకురావడం తెలివి తక్కువ చర్య అన్న చిదంబరం
  • ఇప్పటికైనా రద్దు చేసినందుకు సంతోషం అంటూ వ్యాఖ్యలు
Chidambaram ridicules center decision demolished Rs 2000 notes

కేంద్రం 2016లో రూ.2000 నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని రోజుల కిందట ప్రకటించింది. ఆర్బీఐ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు. 

రూ.2000 నోటును తీసుకురావడమే ఒక తెలివితక్కువ చర్య అని, ఇప్పుడైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. నల్ల డబ్బు దాచుకునేవారి కోసమే ఈ పెద్ద నోటు ఉపయోగపడిందని విమర్శించారు. 

ప్రస్తుతం సామాన్యుల వద్ద రూ.2000 నోట్లు లేవని, రోజువారీ అవసరాలకు రూ.2 వేల నోట్లను ఉపయోగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెద్ద నోట్లను ఉపయోగిస్తున్నది ఎవరు? అని చిదంబరం ప్రశ్నించారు. 

ఎలాంటి పత్రాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఐడెంటిటీ కార్డులతో పని లేకుండా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని బ్యాంకులు చెబుతున్నాయని, ఇప్పుడు కూడా నల్ల డబ్బు దాచుకున్న వారికే ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని దీన్నిబట్టే అర్థమవుతోందని తెలిపారు. సులభంగా మార్చుకోవచ్చంటూ నల్లడబ్బు దాచుకున్నవారికి బ్యాంకులు సాదర స్వాగతం పలుకుతున్నాయని చిదంబరం విమర్శించారు.

More Telugu News