Mumbai Indians: నేటి మ్యాచ్ రోహిత్ శర్మకు అగ్నిపరీక్షే!

  • ఐపీఎల్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ × ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • ఇటీవల వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ
  • ఈ మ్యాచ్ లో రాణించాలన్న పట్టుదలతో ఉన్న రోహిత్ 
MI takes on GujaratTitans on home soil

ఐపీఎల్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. 

అటు, ముంబయి జట్టులోనూ ఎలాంటి మార్పులు లేవు. కాగా, ఇటీవల వరుసగా విఫలమవుతున్న ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఓ అగ్నిపరీక్ష అని చెప్పడంలో సందేహం లేదు. 

ఫాంలో లేకపోవడంతో ఓ మ్యాచ్ లో ఓపెనింగ్ స్థానం వద్దనుకుని దిగువకు వచ్చినా, రోహిత్ శర్మకు ఆశించిన ప్రయోజనం దక్కలేదు. ఆ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్ గా దిగినా అదే పరిస్థితి. 

ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో పోరులో మోహిత్ శర్మ బౌలింగ్ లో రోహిత్ శర్మ అవుటయ్యే పరిస్థితి నుంచి తప్పించుకున్నాడు. బంతి ప్యాడ్లకు తాకగా, గుజరాత్ ఫీల్డర్లు గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ అవుటివ్వకపోవడంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. రీప్లేలో బంతి వికెట్లను తాకుతుందన్న విషయం స్పష్టమైంది. గుజరాత్ జట్టు డీఆర్ఎస్ కు వెళ్లుంటే రోహిత్ శర్మ ఈపాటికి పెవిలియన్ కు తిరిగొచ్చేవాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరు 3 ఓవర్లలో 37 పరుగులు కాగా... కెప్టెన్ రోహిత్ శర్మ 21, ఇషాన్ కిషన్ 15 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News