Botsa Satyanarayana: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబుకు ఎందుకు బాధ?: బొత్స సత్యనారాయణ

  • చంద్రబాబు ఏది మాట్లాడినా రాజకీయం కోసమేనన్న బొత్స
  • కడుపు మంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శ
  • రాజధాని ప్రాంతంలో ఎన్ని దుర్మార్గాలు చేశారో రెండు రోజులు ఆగితే బయటకు వస్తాయని వ్యాఖ్య 
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటే తమకేంటని ప్రశ్న
minister botsa satyanarayana fires on chandrababu

భోగాపురం విమానాశ్రయం రాష్ట్రానికి తలమానికమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కడుపు మంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. జగన్ చేసిన పోరాటం వల్లే భోగాపురం విమానాశ్రయాన్ని 2,300 ఎకరాలకు కుదించారని తెలిపారు. రైతులు ఎవరైనా ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పారా అని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో విమానాశ్రయం శంకుస్థాపన చేస్తే ఆనాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఎందుకు రాలేదని బొత్స నిలదీశారు. చంద్రబాబు ఏది మాట్లాడినా రాజకీయం కోసమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టును నాడు ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకుంటుంటే చంద్రబాబు గడ్డి పీకారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబుకు ఎందుకు బాధ అని బొత్స ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సిట్ వేస్తే కోర్ట్‌కు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఎన్ని దుర్మార్గాలు చేశారో రెండు రోజులు ఆగితే బయటకు వస్తాయి’’ అని అన్నారు.

‘‘రజనీకాంత్, చంద్రబాబు ఎవరి భజన వాళ్లని చేసుకోమనండి. రజనీకాంత్ ఉపన్యాసాలు ఎందుకని మా మంత్రులు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటే మాకెందుకు? పవన్ గతంలో పాచిపోయిన లడ్డు అన్నారు.. ఇప్పుడు సువాసన అంటున్నారు’’ అంటూ బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

More Telugu News