Jack Ma: ప్రొఫెసర్ అవతారమెత్తనున్న జాక్ మా!

  • టోక్యో కాలేజీకి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్లనున్న జాక్ మా
  • అపాయింట్ మెంట్ లెటర్ జారీ చేసిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో
  • 2020లో చైనా ప్రభుత్వాన్ని విమర్శించి చిక్కుల్లో నడిన జాక్ మా
Chinese Billionaire Jack Ma Takes Up Professor Role At Tokyo College

చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ గ్రూప్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు జాక్ మా.. ఇప్పుడు కొత్త అవతారమెత్తనున్నారు. ఓ సాధారణ ప్రొఫెసర్ గా పని చేయనున్నారు. జపాన్ లోని ప్రతిష్ఠాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ టోక్యో’కి చెందిన టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేయాలని ఆయనకు ఆహ్వానం అందింది.

ఈ విషయాన్ని యూనివర్సిటీ వెల్లడించింది. ఆయనకు అపాయింట్‌మెంట్ లెటర్‌ను జారీ చేసినట్లు తెలిపింది. వచ్చే అక్టోబర్ దాకా ఆయన కొనసాగుతారని, తర్వాత కూడా వార్షిక ప్రాతిపదికన కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కీలకమైన రీసెర్చ్ థీమ్ లకు సలహాలు ఇవ్వడంతోపాటు మేనేజ్ మెంట్, బిజినెస్ స్టార్టప్స్ పై స్టూడెంట్లకు జాక్ మా క్లాసులు తీసుకోనున్నారు.

చైనా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలపై అనుసరిస్తున్న విధానాలను జాక్ మా బహిరంగంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 2020లో ప్రభుత్వాన్ని విమర్శించి చిక్కుల్లో పడ్డారు. తర్వాత కొన్ని నెలలపాటు ఆయన కనిపించకుండా పోయారు. చైనా బెదిరింపుల వల్లే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. 

2021లో చైనాను వీడి వెళ్లిన జాక్ మా.. జపాన్, ఆస్ట్రేలియా, థాయ్ లాండ్ వంటి దేశాల్లో కనిపించారు. గత మార్చిలో తిరిగి చైనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో టోక్యో యూనివర్సిటీ నుంచి ప్రకటన రావడం గమనార్హం.

నిజానికి వ్యాపార కార్యకలాపాల నుంచి వైదొలగిన తర్వాత అధ్యాపకుడిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు గతంలోనే జాక్ మా చెప్పారు. అలీబాబా ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పడానికి ముందు జాక్ మా ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేశారు.

More Telugu News