Balakrishna: ఈ నెల 28న విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు... రజనీకాంత్ కూడా వస్తున్నారన్న బాలకృష్ణ

  • టీడీపీలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ శోభ 
  • టీడీ జనార్దన్ నేతృత్వంలో కమిటీ
  • విజయవాడ సభ కోసం సన్నాహాలు
  • అందరూ ఆహ్వానితులేనన్న నందమూరి బాలకృష్ణ
Balakrishna takls about NTR Centenary Celebrations

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. విజయవాడలో ఈ నెల 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని వెల్లడించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. 

విజయవాడ అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా అని, ఆయన నడయాడిన ప్రాంతం అని బాలకృష్ణ వివరించారు. ఆయన విద్యాభ్యాసం కానివ్వండి, నాటక రంగ అనుభవం కానివ్వండి... నటుడిగా ఆయన ఎదుగుదలకు విజయవాడ వేదికగా నిలిచిందని వెల్లడించారు. అందుకే విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ ఆహ్వానితులేనని బాలకృష్ణ పేర్కొన్నారు. 

తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారని, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. తాను ఎలాగూ ఈ కార్యక్రమంలో ఉంటానని బాలయ్య చెప్పుకొచ్చారు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నానని తెలిపారు.

More Telugu News