రూ. 117 కోట్లతో ఉప్పల్ స్టేడియం ఆధునికీకరణ
- మారనున్న స్టేడియం రూపురేఖలు
- దేశంలోని ఐదు స్టేడియాల్లో సౌకర్యాలు కల్పించనున్న బీసీసీఐ
- ఇందుకోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం
ఉప్పల్తో పాటు దేశంలోని పలు స్టేడియాల్లో టాయిలెట్స్, మంచి నీళ్లు, సీటింగ్ వంటి కనీస సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై ఫిర్యాదులు అందడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. వన్డే వరల్డ్ కప్ ముంగిట హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, మొహాలీ, వాంఖడే స్టేడియాలను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు షార్ట్లిస్ట్ చేసిన 12 వేదికల్లో మొహాలీ మినహా మిగిలిన నాలుగు స్టేడియాలున్నాయి. పునరుద్ధరణ కోసం ఉప్పల్ స్టేడియానికి రూ.117.17 కోట్లు, ఢిల్లీకి రూ.100 కోట్లు, ఈడెన్ గార్డెన్స్కు 127.47, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి 79.46 కోట్లు, వాంఖడేకు 78.82 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియాన్ని రెండు దశాబ్దాల కిందట దాదాపు రూ. 60 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇప్పుడు పునరుద్ధరణ కోసం 117 కోట్లు కేటాయించిన నేపథ్యంలో స్టేడియం సరికొత్తగా ముస్తాబు కానుంది.