Undavalli Arun Kumar: మార్గదర్శి అయినా, జగన్ అయినా విచారణను ఎదుర్కోవాల్సిందే: ఉండవల్లి అరుణ్ కుమార్

  • మార్గదర్శి అయినా, జగన్ అయినా విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న ఉండవల్లి
  • తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలను ఇచ్చానని జగన్ తనతో చెప్పారని వ్యాఖ్య
  • చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న ఉండవల్లి
Jagan has to face the court says undavalli

మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ అయినా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయినా సరే ఆర్థిక నేరాల్లో విచారణను ఎదుర్కోవాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అందరికీ లాభాలను ఇచ్చానని తనతోనే జగన్ డైరెక్ట్ గా చెప్పారని అన్నారు. తాను సీఎం కాకముందే తన దగ్గర పెట్టుబడులు పెట్టిన అందరికీ ప్రాఫిట్ ఇచ్చానని జగన్ చెప్పారని తెలిపారు. రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వారికి రూ. 150 కోట్లు ఇచ్చానని, రూ. 200 కోట్లు పెట్టిన వాడు రూ. 220 కోట్లు తీసుకున్నాడని... కావాలంటే లెక్కలు పంపిస్తానని తనతో చెప్పారని అన్నారు. ఒక రోజు ఎయిర్ పోర్టులో తాను కనిపిస్తే ఈ విషయం చెప్పారని తెలిపారు.  

చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఉండవల్లి అన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ ఆరోపించిందని, జరగలేదని జగన్ చెపుతున్నారని.. ఈ అంశంపై కోర్టులో పోరాడాల్సిందేనని చెప్పారు. మోదీ, అమిత్ షాలు వారిపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని, జగన్ తనపై కేసులను ఎందుకు కొట్టేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. జగన్ పై ఉన్న కేసులు ఆర్థిక నేరాలకు సంబంధించినవి కావడం వల్లే ఆయన కేసులు కొట్టేయించుకోలేకపోయారని అన్నారు.

More Telugu News