Kotamreddy Sridhar Reddy: టీడీపీ అభ్యర్థి అనురాధను గెలిపించిన వారిని గుర్తించిన వైసీపీ!

  • నెల్లూరు, కోస్తాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను గుర్తించిన వైసీపీ
  • సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామన్న సజ్జల
  • ఆత్మప్రబోధానుసారం ఓటేసిన కోటంరెడ్డి, ఆనం
YCP Notice two MLAs Who voted against Party

శాసన సభ్యుల ఎమ్మెల్సీ కోటాలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. టీడీపీకి అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా 19 మంది ఎమ్మెల్యేలే ఉండగా 23 ఓట్లు పోలయ్యాయి. మిగతా నాలుగు ఓట్లు ఎలా వచ్చాయన్న దానిపై వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. నలుగురిలో ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారే ఓటేసి ఉంటారని, మిగతా ఇద్దరూ ఎవరై ఉంటారన్న దానిపై అధికార వైసీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రివిజన్ పేరుతో పంచుమర్తి అనురాధకు పోలైన బ్యాలెట్ పత్రాలను పరిశీలించి ఓ అవగాహనకు వచ్చింది.

గత కొంతకాలంగా పార్టీకి రెబల్‌గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓటు వేసినట్టు ప్రకటించారు. అనురాధ గెలుపొందిన వెంటనే శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నెల్లూరులో వారి కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాబట్టి అనురాధకు కోటంరెడ్డి ఓటు వేసి ఉంటారని తేలిపోయింది. రెండో వ్యక్తి నెల్లూరు జిల్లాకే చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఆయన కూడా గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పార్టీ ఆయనను సంప్రదించలేదు కూడా. కాబట్టి ఆయన కూడా ఆత్మప్రబోధానుసారం టీడీపీ అభ్యర్థికి ఓటేసి ఉంటారని చెబుతున్నారు. వీరిద్దరితోపాటు నెల్లూరు జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత, కోస్తా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వైసీపీకి వ్యతిరేకంగా, టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసి ఉంటారని గుర్తించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను గుర్తించామని అయితే, వారి పేర్లను బయటపెట్టబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సమయం వచ్చినప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News