Madhya Pradesh: ఇద్దరు భార్యల భర్తను సమానంగా విభజించిన కోర్టు.. ఒక్కో భార్యతో మూడు రోజులు గడిపి.. ఆదివారం నీ ఇష్టమని తీర్పు!

  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టు తీర్పు
  • 2018లో తొలి వివాహం చేసుకున్న వ్యక్తి
  • లాక్‌డౌన్‌లో భార్యను ఇంటికి పంపి మళ్లీ తీసుకురాని వైనం
  • కంపెనీలో తన సహోద్యోగితో రెండో వివాహం
  • భర్తతో ఉండేందుకు భార్యలిద్దరూ అంగీకారం
Man Who Got Two Marries Got Lucky Chance

‘‘ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య వద్ద మూడు రోజులు ఉండండి. ఆదివారం మీ ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు’’.. ఇద్దరు భార్యల భర్తకు ఓ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పు వెనక ఉన్న అసలు కారణంలోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌కు చెందిన వ్యక్తి హర్యానాలో ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

2018లో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో భార్యను అతడు పుట్టింటికి పంపాడు. ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ అతడు తన భార్యను ఇంటికి తీసుకురాకుండా హర్యానా వెళ్లిపోయాడు. అక్కడ తన సహోద్యోగి అయిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. 

మరోవైపు, భర్త వస్తాడని, తనను తీసుకెళ్తాడని చూసి చూసి విసిగిపోయిన మొదటి భార్య చివరికి తనే హర్యానా వెళ్లింది. అక్కడ తన భర్త మరో మహిళతో కాపురం చేస్తుండడంతో విస్తుపోయింది. ఆ తర్వాత గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్  ఇచ్చింది. చివరికి ముగ్గురితో కలిసి చర్చలు జరిపిన తర్వాత భార్యలు ఇద్దరు అతడితో కలిసి ఉండేందుకు అంగీకరించడంతో భర్తను కోర్టు సమానంగా విభజించింది.

ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య దగ్గర మూడు రోజులు గడిపాలని, ఆదివారం మాత్రం అతడి ఇష్టమని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన భర్త భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.

More Telugu News