Sitaram Yechury: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తిగా సహకరిస్తాం: సీతారాం ఏచూరి

  • జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన కవితకు ఏచూరి సంఘీభావం
  • ధర్నాను  ప్రారంభించిన సీతారాం ఏచూరి
  • మహిళలకు సరైన భాగస్వామ్యం కల్పించనంత వరకు సమాజం ముందుకు వెళ్లదని వ్యాఖ్య
Will fully support Women Reservation Bill says Sitaram Yechury

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఈ ధర్నాను ఉదయం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు సరైన భాగస్వామ్యం లేనంత వరకు మన సమాజం ముందుకు వెళ్లదని చెప్పారు. 

రిజర్వేషన్ల సాధన కోసం కవిత ఒక మంచి అడుగు వేశారని అన్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని... కానీ ఇంత వరకు లోక్ సభలో ఆమోదం పొందలేకపోయిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు గతంలో మోదీ కూడా మద్దతు తెలిపారని... అయినప్పటికీ ఆయన ప్రధాని అయి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా బిల్లును లోక్ సభలో పెట్టలేదని విమర్శించారు. 

ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కోరారు. మహిళా రిజర్వేషన్ కోసం చేసే పోరాటంలో తాము పాల్గొంటామని ఏచూరి తెలిపారు.

More Telugu News