naveen: మద్యం మత్తులో జరిగి ఉంటుంది.. నవీన్ హత్యపై నిందితుడి తండ్రి

  • ఈ హత్య తనొక్కడే చేసి ఉండడని అనుమానాలు
  • హరి సైకో అంటే ఎవరూ నమ్మరని కామెంట్
  • గతంలో ఎప్పుడూ ఎవరినీ కొట్టలేదని వెల్లడి
  • స్నేహితులు, ఆ అమ్మాయిని విచారించాలని డిమాండ్
Hari father responce on naveen murder

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్యపై నిందితుడు హరిహరకృష్ణ తండ్రి స్పందించారు. నవీన్ హత్య మద్యం మత్తులో జరిగి ఉంటుందని చెప్పారు. అయితే, హత్య తన కొడుకు ఒక్కడే చేసి ఉండడని, దీనివెనక మరికొంతమంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నవీన్, హరికృష్ణల స్నేహితురాలును కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.

అదేవిధంగా ఇటీవలే తన కొడుకుతో పాటు మరికొంతమంది ఓ రూమ్ రెంట్ కు తీసుకున్నారని చెప్పారు. అందులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని పోలీసులు వారిని ప్రశ్నిస్తే ఈ దారుణం వెనకున్న అసలు నిజాలు తెలుస్తాయని చెప్పారు. తన కొడుకు హరిహరకృష్ణ బాగా చదివేవాడని, పదో తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చాడని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ ఎవరిపైనా చేయి చేసుకున్న సందర్భాలు లేవని, అలాంటి యువకుడు సైకో అంటే ఎవరూ నమ్మరని చెప్పారు.

ముప్పై ఏళ్లుగా ఆర్ఎంపీగా చేస్తున్న తనకు ఓ సైకో ఎలా ప్రవర్తిస్తాడో అవగాహన ఉందని, అలాంటి లక్షణాలేవీ తన కొడుకులో కనిపించలేదని వివరించారు. అయితే, నవీన్ తల్లిదండ్రుల బాధ తాను అర్ధం చేసుకోగలనని హరికృష్ణ తండ్రి చెప్పారు. ఆ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు. హత్య విషయం తెలిశాక పోలీసులకు లొంగిపోవాలని తనే హరికృష్ణకు చెప్పినట్లు వివరించారు. ఈ కేసులో హరికృష్ణకు ఏ శిక్ష వేయాలన్నది న్యాయస్థానాలే నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు.

More Telugu News