Nandamuri Tarakaratna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ

  • మృత్యుంజయుడై తిరిగి వస్తాడనుకున్నానన్న బాలయ్య
  • ఆ పిలుపు ఇక వినబడదన్న ఊహను తట్టుకోలేకపోతున్నాననంటూ కన్నీళ్లు
  • తారకరత్న మృతి వేదన మిగిల్చిందన్న రామకృష్ణ
Nandamuri Balakrishna deep condolence to Tarakaratna

నందమూరి తారకరత్న మృతి అటు టీడీపీలోను, ఇటు టాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించిన నందమూరి అభిమానులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక, కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. గుండెలవిసేలా రోదిస్తున్నారు. తారకరత్న మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలకృష్ణ.. ఆయన పిలుపును గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాల బాబాయ్ అంటూ తనను ఆప్యాయంగా పిలిచేవాడని, ఆ పిలుపు ఇక వినబడదన్న ఊహను తట్టుకోలేకపోతున్నానని అన్నారు. తారకరత్న మృతి నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. 

తారకరత్న నటనలోనూ తనను తాను నిరూపించుకున్నాడని బాలయ్య అన్నారు. గుండెపోటుకు గురైన తర్వాత ఇన్ని రోజులపాటు మృత్యువుతో పోరాడుతూ వచ్చాడని అన్నారు. కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడై మృత్యుంజయుడిలా తిరిగి వస్తాడని ఆశించినట్టు చెప్పారు. కానీ ఇలా అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోతాడని ఊహించలేదన్నాడు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు బాలకృష్ణ పేర్కొన్నారు.  

ఆ ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి: రామకృష్ణ
తారకరత్న మృతి మనందరినీ తీరని వేదనలో ముంచేసిందని ఆయన బాబాయి నందమూరి రామకృష్ణ అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ప్రేమ, అనురాగం మన తెలుగు తమ్ముళ్లు, తెలుగింటి ఆడపడుచుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News