ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త హెల్త్ స్కీమ్
- మెరుగైన వైద్య సేవల కోసం కొత్తగా "ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్" ఏర్పాటు
- అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీ
- కుటుంబ సభ్యుల వివరాలతో సహా పూర్తి డేటాను సమర్పించాలి
ఉద్యోగుల ఆరోగ్య సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. ఆర్థిక శాఖ సూచనల ప్రకారం ప్రతి ఉద్యోగి, పెన్షనర్ తమ కుటుంబ సభ్యుల వివరాలతో సహా పూర్తి డేటాను తప్పనిసరిగా సమర్పించాలి.
ఈ సమాచారం భవిష్యత్తులో ఆరోగ్య సేవలు, క్యాష్లెస్ చికిత్స వంటి ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్-హెచ్ఆర్ పోర్టల్లో మే 31వ తేదీలోపు అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్ణీత గడువులోగా సమాచారం నమోదు చేయాలని లేదంటే భవిష్యత్తులో ఆరోగ్య పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.