Chandrababu: తన కర్నూలు పర్యటన సూపర్ హిట్ అయిందన్న టీడీపీ చీఫ్.. జిల్లా నేతలపై ప్రశంసల వర్షం!

  • తన కర్నూలు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారన్న చంద్రబాబు
  • పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • అయ్యన్న పాత్రుడికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలన్న పయ్యావుల
Chandrababu Says his Kurnool visit went Super Hit

తన కర్నూలు పర్యటన సూపర్ హిట్ అయిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సర్వసభ్య  సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో తన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ఇటువంటి వారి విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు సభలు జరిగిన ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల నేతలను ఇతర జిల్లాల నేతలు అభినందించారు. జన సమీకరణ అద్భుతంగా చేశారంటూ ప్రశంసలు కురిపించారు. ఇంత పెద్ద ఎత్తున జనాన్ని ఎలా సమీకరించారని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు, ఆదోని మాజీ ఎమ్మెల్యేలు బీవీ జయ నాగేశ్వరరెడ్డి, మీనాక్షి నాయుడుకు ఎక్కువమంది నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, చంద్రబాబు పర్యటనలో అది కనిపించిందని అన్నారు. కాగా, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు.

More Telugu News