Shehbaz Sharif: ఇమ్రాన్ ఖాన్ నికార్సయిన దొంగ: పాక్ ప్రధాని వ్యాఖ్యలు

  • ఇమ్రాన్ ఖాన్ ను వదలని కష్టాలు
  • కానుకలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు
  • ఐదేళ్ల నిషేధం విధించిన ఎన్నికల సంఘం
  • ఆ కానుకలు వేలం వేయాలన్న ప్రధాని షెహబాజ్
Pakistan prime minister Shehbaz Sharif terms Imran Khan a Certified Thief

గతంలో ప్రధానమంత్రి హోదాలో అందుకున్న కానుకలను అమ్ముకోవడంపై ఇమ్రాన్ ఖాన్ సరైన వివరాలు వెల్లడించడంలేదంటూ పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఐదేళ్ల నిషేధం విధించడం తెలిసిందే. ప్రధానిగా ఇతర దేశాల నేతల నుంచి పొందిన కానుకలను దేశ ఖజానా నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు అమ్ముకున్నారని ఇమ్రాన్ పై ఆరోపణలు వచ్చాయి. 

దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ ఒక నికార్సయిన దొంగ అని విమర్శించారు. లాహోర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ అసలు సిసలైన అబద్ధాలకోరు అని, దొంగ అని పేర్కొన్నారు. ఆ కానుకలను ఇమ్రాన్ ఖాన్ వేలం వేయాలని, వచ్చిన సొమ్మును ఖజానాలో జమ చేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.

ఓ కానుక అమ్మకానికి ఉందంటూ తనకు కూడా గతంలో క్యాబినెట్ డివిజన్ నుంచి లేఖ అందిందని వెల్లడించారు. అయితే, తాను అందుకు నిరాకరించానని, వచ్చిన సొమ్మును ఖజానాలో జమ చేయాలని సూచించానని తెలిపారు. 

దేశానికి లభించిన విలువైన బహుమతులు పోయాయన్న అపప్రదను తొలగించేందుకు వాటిని ఇప్పుడు తన నివాసంలో ప్రదర్శనకు ఉంచుతున్నామని ప్రధాని షెహబాజ్ వెల్లడించారు.

More Telugu News