Anitha: జూనియర్ ఎన్టీఆర్ ను కొడాలి నాని మోసం చేశారు: వంగలపూడి అనిత

  • హరికృష్ణను కొడాలి నాని ముంచేశారన్న అనిత
  • జగన్ కు సైతం టోపీ పెట్టారని విమర్శ
  • కనీస జ్ఞానం లేకుండానే కొడాలి నాని మాట్లాడుతున్నారని వ్యాఖ్య
Kodali Nani deceived Junior NTR says Anitha

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందమూరి హరికృష్ణను గతంలో కొడాలి నాని ముంచేశారని ఆమె అన్నారు. ఈ కారణం వల్లే నానిని ఆయన తన్ని తరిమేశారని చెప్పారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చేరి బాడీగార్డు మాదిరి పని చేశారని... చివరకు ఆయనను సైతం మోసం చేశారని... దీంతో ఆయనను జూనియర్ దూరం పెట్టేశారని తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కు కూడా టోపీ పెట్టారని, దీంతో కేబినెట్ నుంచి ఆయనను తొలగించారని చెప్పారు. 

తిరుమల కొండను వైజాగ్ లోని రుషికొండతో ఎలా పోలుస్తారని అనిత ఎద్దేవా చేశారు. కొందరు స్వార్థపరుల కోసం రుషికొండను వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని అన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కొంత కొండను పగులగొట్టి నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. తిరుమలలో ఎక్కడా పచ్చదనానికి, పర్యావరణానికి ముప్పు కలగలేదని అన్నారు. పదో తరగతి ఫెయిలైన బ్యాచ్ మొత్తం వైసీపీలోనే ఉందని... కనీస జ్ఞానం లేకుండానే కొడాలి నాని మాట్లాడుతున్నారని విమర్శించారు. 

విశాఖలో తమ భూ కుంభకోణాలు బయటపడతాయనే అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ అడ్డుకుంటోందని అనిత మండిపడ్డారు. అందుకే మూడు రాజధానులు అంటూ రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో ఈ నెల 15న జరిగేది ప్రజాగర్జన కాదని... భూ కబ్జారాయుళ్ల సభ అని అన్నారు. విశాఖలో ఏర్పడింది జేఏసీ కాదని... జగన్ యాక్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు.

More Telugu News