Tarun: అప్పుడున్నంత ఆకలి ఇప్పుడు లేదు .. ఎందుకంటే ఇప్పుడు అలాంటి భోజనాలు లేవు: ప్రకాశ్ రాజ్

  • 'నువ్వే నువ్వే' సెలబ్రేషన్స్ లో ప్రకాశ్ రాజ్ 
  • ఆ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉందంటూ వెల్లడి 
  • త్రివిక్రమ్ పై ప్రశంసల వర్షం 
  • ఆయన సినిమా విందు భోజనమంటూ కితాబు
Nuvve Nuvve 20 years celebrations

త్రివిక్రమ్ 'నువ్వే నువ్వే' సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. నిన్నటితో ఈ సినిమా 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సెలబ్రేషన్స్ లో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా చేసి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అందరం అలాగే ఉన్నాము .. అంటే మనలో ఇంకా యవ్వనం పోలేదని అర్థం. నిన్న కాల్ చేసి ఈ సెలబ్రేషన్ గురించి చెబితే, ఫామ్ హౌస్ నుంచి వచ్చాను. మళ్లీ ఈ సినిమాను చూశాను. ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. 

తరుణ్ తో కలిసి నేను చేసిన ఫస్టు సినిమా అది. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే, అప్పట్లో తరుణ్ లో భయం .. బెరుకు ఏమీ కనిపించలేదు .. చాలా కాన్ఫిడెంట్ గా చేశాడు. ఈ సినిమాలో నా పాత్ర కోసం త్రివిక్రమ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ .. సీన్స్ రాశాడు. అప్పుడు ఉన్న ఆకలి నాలో ఇప్పుడు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి మంచి భోజనాలు ఇప్పుడు లేవు. 

20 ఏళ్ల ముందు కూడా త్రివిక్రమ్ నాపై నమ్మకం ఉంచి .. నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు నాకు ఇంకా గుర్తున్నాయి. రైటర్ గా ఉన్నప్పటి నుంచి త్రివిక్రమ్ నాకు తెలుసు. ఇద్దరం తరచూ కలుసుకుంటూ .. మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆయన డైలాగ్స్ లో ఒక లాలిత్యం ఉండేది .. జీవితసత్యాలు ఉండేవి. ఆయన డైలాగ్స్ నా ద్వారా జనంలోకి వెళ్లడం వల్లనే ఆ సినిమాలో నాకు అంతటి గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News