Rashmika Mandanna: ఎన్టీఆర్‌, కొర‌టాల చిత్రానికి ర‌ష్మిక గ్రీన్ సిగ్నల్!

  • ఈ చిత్రంలో న‌టించ‌డంపై స్పందించిన స్టార్ హీరోయిన్
  • బాలీవుడ్‌లో ర‌ష్మిక తొలి చిత్రం గుడ్‌బై విడుద‌ల‌
  • అందులో తార పాత్ర‌కు మంచి స్పంద‌న‌
 Rashmika Mandanna About NTR 30

ద‌క్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతూనే బాలీవుడ్‌లోనూ త‌న హ‌వా మొద‌లు పెట్టేందుకు సిద్ద‌మైంది స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌. ‘గుడ్‌ బై’ తో ఆమె బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. నిన్న విడుద‌లైన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టించింది ర‌ష్మిక‌. అమితాబ్‌కు కూతురిగా ఆమె పోషించిన తార పాత్రకు మంచి స్పందన వ‌స్తోంది. మొన్న‌టిదాకా ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో ర‌ష్మిక బిజీ బిజీగా గడిపింది. షూటింగ్‌, ప్ర‌మోష‌న్స్‌కు బ్రేక్ ఇచ్చి ఈ మ‌ధ్యే మాల్దీవ్స్‌ విహార యాత్ర‌కు వెళ్లింది. ఇప్ప‌టికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఖాతాలో మరో భారీ చిత్రం కూడా చేరింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న ప్యాన్ ఇండియా చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టు తెలుస్తోంది. 

తొలుత ఆలియా భట్ ను అనుకున్నారు. కానీ, ఆమె తొంద‌ర్లోనే ఓ బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతోంది. త‌ర్వాత జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. అదే స‌మ‌యంలో ర‌ష్మిక పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఈ విషయంపై  ర‌ష్మిక స్పందించింది. ఎన్టీఆర్‌‌తో సినిమాలో న‌టిస్తున్నారా?అని అడిగితే.. ‘అప్పుడే ఎలా తెలిసింది.. ఇంకా అఫీషియల్‌గా కూడా చెప్పలేదు’ అని చెప్పిందామె. ఇందులో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాన‌ని తెలిపింది. దాంతో,  ఈ చిత్రంలో ర‌ష్మిక‌నే హీరోయిన్ అని దాదాపు స్ప‌ష్టం అయిపోయింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక ఖాతాలో ప‌లు చిత్రాలు ఉన్నాయి. హిందీలో ‘మిషన్ మజ్ను’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ‘యానిమల్’లో నటిస్తోంది. తెలుగులో వారసుడు, పుష్ప 2 చిత్రాలు చేస్తోంది.

More Telugu News