Mani Ratnam: బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ పీఎస్1 ప్ర‌భంజనం.. రెండు రోజుల్లోనే 150 కోట్ల వ‌సూళ్లు

  • సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన చిత్రం
  • మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినప్ప‌టికీ వ‌సూళ్ల‌లో దూకుడు
  • మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మెగా చిత్రం
Ponniyin Selvan box office collection Day 2 mints Rs 150 crore globally

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ (పీఎస్1) శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. మొద‌ట
మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్నప్ప‌టికీ వ‌సూళ్లలో మాత్రం దూసుకెళ్తోంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. త‌మిళ ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దాంతో, రెండు రోజుల్లోనే పీఎస్1 ప్ర‌పంచ వ్యాప్తంగా  రూ. 150 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం 'విక్రమ్ వేద' నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ  'పీఎస్‌1'కి భార‌త్‌తో పాటు విదేశాల్లో అద్భుత ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఆదివారం కావ‌డంతో మూడో రోజు కూడా ఇదే జోరు కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. తొలి వీకెండ్ లోనే ఈ చిత్రం 200 నుంచి 250 కోట్ల మార్కును దాటే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌ణిర‌త్నం ఈ చిత్రాన్ని చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించారు. ఇది ఆయ‌న క‌ల‌ల ప్రాజెక్టు. దీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ఇప్ప‌టికి నెర‌వేరింది. రెండు, మూడు భాగాల్లో రానున్న ఈ చిత్రాన్ని రూ. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత వ‌సూళ్ల జోరు ఇలానే కొన‌సాగితే తొలి పార్టుతోనే ఈ చిత్రం పెట్టుబ‌డిని రాబ‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

More Telugu News