Russia: పుతిన్ నిర్ణయంతో హడలిపోతూ దేశాన్ని వీడుతున్న రష్యన్లు!

  • ఫిబ్రవరి 24 నుంచి రష్యా దాడులు
  • ఎంతకీ లొంగని ఉక్రెయిన్
  • 3 లక్షల మందిని సమీకరించేందుకు సన్నాహాలు
Reportedly Russians tries to leave country

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్న రష్యా ఆశించిన ఫలితాన్ని మాత్రం పొందలేకపోయింది. రష్యా సైనికశక్తి ముందు ఉక్రెయిన్ ఏమాత్రం నిలవలేదని రక్షణ రంగ నిపుణులు యుద్ధానికి ముందు తమ విశ్లేషణలు వినిపించారు. వారి విశ్లేషణలు తప్పని నిరూపిస్తూ గత 7 నెలలుగా ఉక్రెయిన్ పోరాడుతూ రష్యాకు కొరకరానికొయ్యలా మారింది. 

ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ పై దాడుల్లో తీవ్రత పెంచాలని రష్యా అధినాయకత్వం నిర్ణయించింది. అందుకోసం భారీ ఎత్తున సైనిక సమీకరణ చేపడుతోంది. ఎయిర్ లైన్స్ సంస్థల్లో పనిచేస్తున్న వారిని, ఎయిర్ పోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బందిని సైన్యంలో చేరాలంటూ హుకుం జారీ చేసింది. 

ప్రస్తుతం ఉన్న సైన్యానికి అదనంగా మరో 3 లక్షల మందిని సమీకరించాలన్నది రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక్క ఏరోఫ్లోట్ విమానయాన సంస్థ నుంచే సగానికి పైగా సిబ్బందిని సైన్యంలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆజ్ఞలు జారీ చేశారు. 

అయితే పుతిన్ ఆదేశాలకు భయపడిన రష్యన్ పౌరులు సైన్యంలో చేరడం ఇష్టంలేక దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో రష్యా నుంచి బయల్దేరే విమానాల్లో ఖాళీలు ఉండడంలేదు. అంతేకాదు, రోడ్డు మార్గంలోనూ దేశాన్ని దాటేందుకు ప్రయత్నించేవారితో రహదారులపై రద్దీ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. 

దీన్ని పసిగట్టిన పుతిన్ ప్రభుత్వం 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వారికి విమాన టికెట్లు విక్రయించవద్దని ఎయిర్ లైన్స్ సంస్థలకు నిర్దేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా, తన ఆయుధ సంపత్తికి ఎదురొడ్డి నిలవడమే కాకుండా, పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ తమను దెబ్బతీస్తుండడం రష్యా అధినాయకత్వానికి అసహనం కలిగిస్తోంది. అందుకే, మునుపటిలా కాకుండా, ఈసారి మరింత సైనిక శక్తితో భీకర దాడులు జరపాలని పుతిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News