Pavan Kalyan: 'వీరమల్లు' తదుపరి షెడ్యూల్ డేట్ ఖరారైనట్టే!

  • చాలాకాలం క్రితమే సెట్స్ పైకి వెళ్లిన 'వీరమల్లు'
  • కొన్ని కారణాల వలన షూటింగు విషయంలో జాప్యం
  • కథానాయికగా అలరించనున్న నిధి అగర్వాల్   
  • వచ్చేనెల 16 నుంచి తదుపరి షెడ్యూల్ 
  • వచ్చే ఏడాది మార్చి 30న సినిమా రిలీజ్
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ తన కెరియర్లో తొలి చారిత్రక చిత్రంగా 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఎ.ఎమ్. రత్నం నిర్మాణంలో .. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలాకాలమే అయింది. అయితే కోవిడ్ కారణంగా .. ఆ తరువాత రాజకీయాలలో పవన్ బిజీగా ఉండటం వలన, ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.

మధ్యలో ఒకటి రెండు సార్లు షూటింగు పెట్టారుగానీ, అదీ చాలా తక్కువ రోజులే. ఇప్పుడు మాత్రం పక్కా ప్రణాళిక రూపొందిందని అంటున్నారు. దసరా తరువాత అంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. పవన్ తో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొంటారని అంటున్నారు. 

నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్జున్ రాంపాల్ .. నర్గిస్ ఫక్రీ .. ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పవన్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నారు.

More Telugu News