TRS: ఈ సారీ సిట్టింగ్‌ల‌కు టికెట్లు.. 80 సీట్ల దాకా గెలుస్తాం: టీఆర్ఎస్ఎల్పీ భేటీలో కేసీఆర్‌

  • టీఆర్ఎస్ఎల్పీ భేటీలో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్‌
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అన్న సీఎం
  • మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ పోటీలోనే లేద‌ని వ్యాఖ్య‌
kcr interesting comments on ts assembly elections in trslp meeting

తెలంగాణ సీఎం కేసీఆర్ శ‌నివారం బిజీబిజీగా గ‌డిపారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించిన కేసీఆర్‌... ఆ వెంట‌నే టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ లెజ‌స్లేచ‌ర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాలుపంచుకున్న ఈ స‌మావేశంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ద‌ఫా కూడా సిట్టింగ్‌ల‌కే సీట్లు ఇస్తామ‌న్న కేసీఆర్‌... ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ఎస్‌కే విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌న్న కేసీఆర్‌... ఎన్నిక‌ల్లో పార్టీకి 72 నుంచి 80 సీట్ల దాకా వ‌స్తాయ‌ని చెప్పారు. స‌ర్వేల‌న్నీ కూడా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక‌ను కూడా టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిస్తే... బీజేపీకి ద‌క్కేది మూడో స్థాన‌మేన‌న్నారు. ఉప ఎన్నిక‌లో బీజేపీ అస‌లు పోటీలోనే లేద‌ని తెలిపారు. ఉప ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి రెండు గ్రామాల‌కు ఓ ఎమ్మెల్యేను ఇంచార్జీగా నియ‌మించ‌నున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు.

More Telugu News