Udhav Thackeray: నాడు అమిత్ షా మాట నిలబెట్టుకుని ఉంటే ఇవాళ బీజేపీ నేత సీఎం అయ్యేవాడు: ఉద్ధవ్ థాకరే

  • మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే
  • బీజేపీ నేత ఫడ్నవీస్ కు ఉప ముఖ్యమంత్రి పదవి
  • గత పరిణామాలను గుర్తుచేసిన ఉద్ధవ్ థాకరే
Udhav Thackeray comments on latest developments

గత కొన్ని రోజులుగా దేశంలో చర్చనీయాంశంగా మారిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి కాగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో, తాజా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు అమిత్ షా తన మాటకు కట్టుబడి ఉండుంటే ఇవాళ బీజేపీ నేత ముఖ్యమంత్రి పీఠంపై ఉండేవాడని థాకరే వ్యాఖ్యానించారు. 

నాడు ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు శివసేన నేత సీఎం అయ్యేందుకు అమిత్ షా అంగీకరించి ఉంటే, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందేది కాదని, రెండున్నరేళ్లు శివసేన, రెండున్నరేళ్లు బీజేపీ పాలించేవని థాకరే పేర్కొన్నారు. "కానీ నిన్న ఏం జరిగింది? తనను తాను శివసేన నేతనని చెప్పుకునే వ్యక్తి సీఎం అయ్యాడు. ఆ సీఎం (ఏక్ నాథ్ షిండే) శివసేన నేత కాదు" అని స్పష్టం చేశారు. 

ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ పొత్తు భాగస్వామ్యంలో భేదాభిప్రాయాలతో విడిపోయాయి. అనంతరం మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ పేరిట శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

More Telugu News