Sharad Pawar: రాష్ట్రప‌తి ఎన్నికల రేసులో గోపాల‌కృష్ణ‌ గాంధీ, ఫ‌రూక్ అబ్దుల్లా!... ఈనెల‌ 21న మ‌రో భేటీ అన్న దీదీ!

  • డిల్లీలో ముగిసిన విప‌క్షాల భేటీ
  • శ‌ర‌ద్ ప‌వార్‌ను ఏకగ్రీవంగా ప్ర‌తిపాదించిన స‌మావేశం
  • పోటీకి నిరాక‌రించిన ప‌వార్‌
  • గోపాల‌కృష్ణ గాంధీ, ఫ‌రూక్ అబ్దుల్లా పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నామ‌న్న దీదీ
  • ఈ నెల 21న జ‌రిగే భేటీలో అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డి
mamata banerjee meeting with oppposition parties concludes

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి రేసులో నుంచి ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ రేసులోకి గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూష‌న్ క్లబ్‌లో ప‌లు విప‌క్షాల‌తో జ‌రిగిన స‌మావేశం ముగిసిన త‌ర్వాత దీదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న విష‌యంపై చ‌ర్చించేందుకు ఈ నెల 21న మ‌రోమారు భేటీ అవుతామ‌ని ఆమె ప్ర‌క‌టించారు. 

బుధ‌వారం నాటి భేటీ ప్రారంభం కాగానే... విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా శ‌ర‌ద్ ప‌వార్‌ను ఏక‌గ్రీవంగా ప్ర‌తిపాదించామ‌ని దీదీ తెలిపారు. అయితే పోటీకి నిరాకరిస్తూ శ‌ర‌ద్ ప్ర‌క‌ట‌న చేయడంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని ఆమె చెప్పారు. ఇందులో భాగంగా గ‌తంలో ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన గోపాల‌కృష్ణ గాంధీతో పాటు జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా పేరు‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని ఆమె చెప్పారు. విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఎంపిక కోసం ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పిన దీదీ... ఈ నెల 21న జ‌రిగే మ‌లి విడ‌త స‌మావేశంలో అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

More Telugu News