President Of India: రాష్ట్రప‌తి రేసులో వెంక‌య్య‌!.. బ‌రిలో మ‌రికొంద‌రంటూ ఊహాగానాలు!

  • ఎన్డీఏ త‌ర‌ఫున వెంక‌య్య స‌హా బ‌రిలో ఐదుగురు నేత‌లు
  • ద్రౌప‌ది ముర్ముకు అవ‌కాశాలు ఎక్కువ‌న్న‌ట్లు విశ్లేష‌ణ‌లు
  • యూపీఏ నుంచి శ‌ర‌ద్ పవార్‌, మీరా కుమార్ పేర్లు
  • ఎన్డీఏ అభ్య‌ర్థిదే గెలుపంటూ ప‌వార్ ఇదివ‌ర‌కే కామెంట్లు
venkaiah naidu is in the race of president of india

భార‌త రాష్ట్రప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ జులై 24న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. కొత్త రాష్ట్రప‌తి జులై 25న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో భార‌త నూత‌న రాష్ట్రప‌తిగా ఎవ‌ర‌న్న విష‌యాన్ని తేల్చేందుకు జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్ విడుద‌ల చేసింది. 

ఈ షెడ్యూల్ ప్ర‌కారం జులై 18న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా... కొత్త రాష్ట్రప‌తి ఎవ‌ర‌న్న‌ది జులై 21న జ‌ర‌గ‌నున్న ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. మ‌రి రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా అధికార ఎన్డీఏ, విప‌క్ష యూపీఏలు ఎవ‌రిని బ‌రిలోకి దించుతాయ‌న్న విష‌యంపై అప్పుడే ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రప‌తిని ఎన్నుకునే ఎల‌క్టోర‌ల్ కాలేజీలో అధికార ఎన్డీఏ కూట‌మి త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థి ఎన్నిక దాదాపుగా లాంఛ‌న‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎన్డీఏ త‌ర‌ఫున రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్రప‌తిగా కొన‌సాగుతున్న తెలుగు నేల‌కు చెందిన ముప్ప‌వ‌ర‌పు వెంకయ్య‌నాయుడి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ద‌క్షిణాది రాష్ట్రాల నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించే దిశ‌గా బీజేపీ నిర్ణ‌యం తీసుకుంటే... వివాదర‌హితుడిగా పేరున్న వెంకయ్యే ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఖరార‌య్యే అవ‌కాశాలున్నాయి. 

ఇక తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేస్తున్న త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. ద‌క్షిణాది రాష్ట్రాలు, మ‌హిళా కోటా అనుకుంటే త‌మిళిసైకి అవ‌కాశం ద‌క్కే ఛాన్సున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏ అభ్య‌ర్థులుగా మ‌రికొంద‌రి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మద్ ఖాన్‌, అసోం గ‌వర్న‌ర్ జ‌గ‌దీశ్ ముఖీ. ఝార్ఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము, ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ అన‌సూయ యూకీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎస్టీ కేట‌గిరీకి చెందిన మ‌హిళా నేత ద్రౌప‌ది ముర్ము పేరు రేసులో ముందున్న‌ట్లుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇక విప‌క్ష యూపీఏ శిబిరం విష‌యానికి వ‌స్తే... ఎన్సీపీ అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు కేంద్ర మంత్రిగా, లోక్ స‌భ స్పీక‌ర్‌గానూ రాణించిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నేత మీరా కుమార్‌లు రేసులో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే యూపీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచేందుకు ఇదివ‌ర‌కే శ‌ర‌ద్ పవార్ ఆస‌క్తి చూప‌లేదు. అధికార ప‌క్షానికి స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఉన్న నేప‌థ్యంలో ఓడిపోతామ‌ని తెలిసి కూడా బ‌రిలో నిల‌వాల్సిన అవ‌స‌రం లేద‌న్న కోణంలో ప‌వార్ వ్యాఖ్యానించారు.

More Telugu News