Hardik Pandya: తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచకప్ కొట్టడమే: హార్థిక్ పాండ్యా 

  • జట్టు విజయమే తనకు కీలకమన్న పాండ్యా
  • భారత్ తరఫున ఆడడాన్ని ఆనందిస్తానని వెల్లడి
  • తనవరకు తాను లక్కీ అంటూ ప్రకటన
  • ఆడిన ఐదు ఫైనల్స్ లోనూ టైటిల్ గెలిచానన్న గుజరాత్ కెప్టెన్
Hardik Pandya wants to win T20 World Cup with India

కెప్టెన్ గా గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ టైటిల్ తెచ్చి పెట్టిన హార్థిక్ పాండ్యా.. తన తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచకప్ లో భారత్ ను గెలిపించడమేనని చెప్పాడు. కీలకమైన మూడు వికెట్లు.. అందులో ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక పరుగులు సాధించిన జోస్ బట్లర్ వికెట్ ను తీయడం ద్వారా ఆ జట్టును తక్కువ స్కోర్ కు ఫైనల్ లో కట్టడి చేసినట్టు వివరించాడు.

మీ తదుపరి లక్ష్యం ఏమిటి? అంటూ ఈ సందర్భంగా పాండ్యాను ప్రశ్నించగా.. ‘‘భారత్ కోసం ప్రపంచకప్ ను సాధించి పెట్టడమే. నా దగ్గర ఉన్నదంతా ఇవ్వబోతున్నాను. జట్టే ప్రథమం అని భావించే ఆటగాడిని. నా జట్టు విజయం సాధించడమే నా లక్ష్యం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే ఆనందిస్తా. దీర్ఘకాలం అయినా, స్వల్ప కాలం అయినా ఏం జరిగినా ప్రపంచకప్ ను గెలవడమే లక్ష్యం’’ అని పాండ్యా చెప్పాడు. 

కెప్టెన్ గా ఐపీఎల్ టైటిల్ ను గెలవడమే కొంచెం ప్రత్యేకమని పాండ్యా పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరఫున నాలుగు టైటిల్ విజయాల్లో పాండ్యా పాత్రధారి అన్న విషయం తెలిసిందే. ‘‘నా వరకు నేను లక్కీ అని భావిస్తాను. ఎందుకంటే ఐదు ఫైనల్స్ ఆడాను. ఐదు సందర్భాల్లోనూ టైటిల్ అందుకున్నాను’’ అంటూ పాండ్యా తన గత ట్రాక్ రికార్డును గుర్తు చేశాడు.

More Telugu News