ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో... ఇప్పటివరకు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఓసారి చూస్తే...!

KA Paul opines on Russia and Ukraine crisis
  • ఉక్రెయిన్ లో రష్యా సేనల ఆక్రమణలు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్
  • పుతిన్ కు పిచ్చెక్కిందని వ్యాఖ్యలు
  • గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నానని వెల్లడి
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రపై అంతర్జాతీయ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ స్పందించారు. ఆయన నిన్నటినుంచి ఈ అంశంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. పుతిన్ కు 69 ఏళ్ల వయసులో పిచ్చి పట్టిందని విమర్శించారు. మెంటల్ పుతిన్ సర్వనాశనం చేస్తాడన్న విషయం తనకు ముందే తెలుసన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయకుండా తాను చాలారోజుల నుంచే కృషి చేస్తున్నానని, గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నానని కేఏ పాల్ వెల్లడించారు. 

అసలు, ఉక్రెయిన్ కు సైన్యాన్ని పంపాలని గతనెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు చెప్పానని, అప్పుడు సరేనన్న బైడెన్, ఇప్పుడు వెనుకంజ వేశారని ఆరోపించారు. కళ్లు నెత్తికెక్కిన బైడెన్ ఏంచేస్తున్నాడో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. 

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రాస్ ను కూడా కేఏ పాల్ టార్గెట్ చేశారు. గుటెర్రాస్ కు బుర్ర పనిచేయడం లేదన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి పెద్ద విషయమేం కాదని అంటున్నారని మండిపడ్డారు. యుద్ధాన్ని ఆపలేని ఆయన ఆ పదవిలో ఎందుకని ప్రశ్నించారు.  

అంతేకాదు, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణలను కోరానని, వారు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రపంచశాంతిని కోరుకుంటానని అందరికీ తెలిసిన విషయమేనని, ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలోనూ రష్యాను వ్యతిరేకిస్తున్నానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
KA Paul
Russia
Vladimir Putin
Ukraine
Joe Biden
USA
India

More Telugu News