Maoists: మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు.. మహిళ సాహసం

  • చత్తీస్‌గఢ్‌లో ఘటన
  • వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజినీర్, కార్మికుడి కిడ్నాప్
  • రెండున్నరేళ్లు, ఐదేళ్ల వయసున్న పిల్లలతో అడవిలోకి
  • మావోలు విడిచిపెట్టడంతో తిరిగి ఇంటికి
Woman and Daughter Go Into Forest To Look For Husband Kidnapped By Maoists

మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ మహిళ సాహసం చేసింది. ఐదేళ్లలోపు వయసున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తను వెతుక్కుంటూ దండకారణ్యంలోకి బయలుదేరారు. ఈ క్రమంలో తన భర్తను మావోయిస్టులు విడిచిపెట్టారన్న సమాచారంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిందీ ఘటన.

ఇంద్రావతి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌లను ఈ నెల 11న మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలి.. తన ఇద్దరు పిల్లలను చూసైనా తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండున్నరేళ్లు, ఐదేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తను వెతుక్కుంటూ బీజాపూర్, నారాయణ్‌పూర్ సరిహద్దులోని అబుజ్మద్ అడవిలోకి బయలుదేరారు. స్థానిక జర్నలిస్టుల సాయంతో మావోయిస్టులను కలవాలని నిర్ణయించుకుని అడవి బాట పట్టారు.

ఈ క్రమంలో తాము అపహరించిన ఇద్దరినీ మావోయిస్టులు విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న సోనాలి ఆనందంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. అశోక్ పవార్‌కు స్వల్పంగా గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. మావోలు తమను ఇబ్బంది పెట్టలేదని, చెరో రూ. 2 వేలు ఇచ్చి పంపించారని అపహరణకు గురైన కార్మికుడు ఆనంద్ చెప్పారు.

  • Loading...

More Telugu News