'నా చెంపలు చెళ్లుమనిపించు' అంటూ మహిళను బతిమిలాడిన మంత్రి.. వీడియో ఇదిగో
- మధ్యప్రదేశ్లో ఘటన
- గ్వాలియర్లో దుకాణాల తొలగింపు
- కన్నీరు పెట్టుకున్న మహిళ
- తమను క్షమించాలంటూ వేడుకున్న మంత్రి
- తనను కొట్టాలంటూ మహిళ కాళ్లు మొక్కిన ప్రధుమాన్
గ్వాలియర్లోని ఓ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరగడంతో రోడ్డుపక్కన ఉండే కూరగాయల మార్కెట్ను అధికారులు మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ సమయంలో బాబాని అనే మహిళ తన కూరగాయల దుకాణం తీసేస్తే ఉపాధి పోతుందని లబోదిబోమని ఏడ్చింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్.. ఆ మహిళ బాధను చూసి తాను ఆవేదనతో తట్టుకోలేకపోయినట్లు ప్రవర్తించారు.
ముందు తనను కొట్టాలని, తమను క్షమించాలని ఆమెను కోరారు. తాము చేసేది ఏమీ లేదని చెప్పారు. కూరగాయల మార్కెట్ను తరలించక తప్పట్లేదని అన్నారు. మహిళ చేతులు పట్టుకుని బతిమిలాడుతూ తనను కొట్టి శిక్షించాలని కోరారు. ఇటువంటి వింత చేష్టలతో వార్తల్లో నిలవడం ఆయనకు కొత్తేం కాదు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఓ పాఠశాలకు వెళ్లి టాయిలెట్లు కడిగిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
గ్వాలియర్ లోని తమ పాఠశాలలో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండడం లేదంటూ ఓ బాలిక మంత్రికి ఫిర్యాదు చేయడంతో అక్కడకు వెళ్లిన మంత్రి తోమర్ స్వయంగా పైపుతో నీళ్లు పోస్తూ టాయిలెట్లను కడిగి శుభ్రం చేశారు. అంతకుముందు గ్వాలియర్ నియోజకవర్గంలోని బిర్లానగర్లో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టి మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు. గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అక్కడకు వెళ్లి వాటిని కడిగి అధికారులకు బుద్ధి చెప్పారు.