Nakka Anand Babu: గంజాయి వ్యవహారంలో నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు

  • గంజాయి దందాపై ఆనంద్ బాబు ప్రెస్ మీట్
  • ఆనంద్ బాబుకు పోలీసుల నోటీసులు
  • నోటీసులు తీసుకునేందుకు ఆనంద్ బాబు ససేమిరా
  • ఈ ఉదయం మరోసారి ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు
Police records Nakka Anand Babu statement

ఏపీలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం అడ్డుఅదుపు లేకుండా సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించడం, గంజాయి వ్యవహారంపై మీరు ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో ఆ ఆధారాలు తమకు ఇవ్వాలంటూ నర్సీపట్నం పోలీసులు నిన్న రాత్రి గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశాఖలో గంజాయి దందాకు సంబంధించి నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలాన్ని పోలీసులు నేడు నమోదు చేసుకున్నారు.

ఓ ప్రెస్ మీట్ లో నక్కా ఆనంద్ బాబు గంజాయి దందాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనంద్ బాబు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలను పోలీసులు తీవ్రంగా పరిగణించి గత అర్ధరాత్రి ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నోటీసులు తీసుకునేందుకు ఆనంద్ బాబు నిరాకరించారు. దాంతో పోలీసులు ఈ ఉదయం మరోసారి ఆయన నివాసానికి వెళ్లారు.

కాగా, పోలీసుల తీరుపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ మాజీ మంత్రినని, తన అభిప్రాయాలు చెప్పేంత స్వేచ్ఛ కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా?... పోలీసులకు ఆధారాలు ఇవ్వాల్సింది మేమా? అని నిలదీశారు.

More Telugu News