Revanth Reddy: ఇంత ఘోరమా... నా రక్తం మరిగిపోతోంది: రేవంత్ రెడ్డి

  • నిన్న 'జంగ్ సైరన్' కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్
  • నిరుద్యోగులకు మద్ధతుగా కార్యక్రమం
  • ఉద్రిక్తంగా మారిన 'జంగ్ సైరన్'
  • గాయపడి ఆసుపత్రిపాలైన వెంకట్ బల్మూర్
  • నేడు పరామర్శించిన రేవంత్
Revanth Reddy visits Venkat Balmoor

తెలంగాణలో నిరుద్యోగ అంశంపై కాంగ్రెస్ నిన్న చేపట్టిన 'జంగ్ సైరన్' కార్యక్రమం ఉద్రిక్తంగా మారగా, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గాయపడ్డారు. ఆయనను కాంగ్రెస్ శ్రేణులు ఆసుపత్రికి తరలించాయి. ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ బల్మూర్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు పరామర్శించారు. వెంకట్ బల్మూర్ పరిస్థితిపై ట్విట్టర్ లో స్పందించారు.

ఇంత ఘోరమా... ఈ అరాచకం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది... రక్తం మరిగిపోతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న తెలంగాణ పోలీసులు నిరుద్యోగులను ఉగ్రవాదుల్లా భావిస్తున్నారని, అందుకు కారణం వారు ఉద్యోగాలను డిమాండ్ చేయడమేనని విమర్శించారు. హక్కుల సాధనలో తమను లాఠీలు, బుల్లెట్లు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. తెలంగాణను ఎందుకోసం సాధించుకున్నామో, అది సాకారం చేసుకునే క్రమంలో తమను ఎవరూ అడ్డుకోలేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా వెంకట్ బల్మూర్ ను పరామర్శించిన వారిలో దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.

More Telugu News