KCR: హరితహారం పథకంపై కేసీఆర్ కీలక నిర్ణయం

  • హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటన
  • ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల నుంచి ప్రతి నెలా నిధి వసూలు
  • పచ్చదనం పెంపుదలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపు
KCR announces Haritha Nidhi

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద ప్రతి ఏటా కోట్లాది మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం యొక్క ఫలితం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో చెట్లు పెరిగి కనువిందు చేస్తున్నాయి. మరోవైపు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హరిత నిధిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పచ్చదనాన్ని పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు రూ. 100... ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రూ. 25 ఇవ్వాలని కోరారు.

అలాగే, రిజిస్ట్రేషన్లు, భవనాల అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొంత మొత్తాన్ని వసూలు చేయాలని చెప్పారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఐదు రూపాయలు తీసుకోవాలని తెలిపారు. దీంతో పాటు వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలను సేకరించాలని చెప్పారు.

More Telugu News