Nara Lokesh: సవాంగ్ గారూ... డీజీపీ పదవి కోసం ఇంత దిగజారిపోవాలా?: నారా లోకేశ్

  • విపక్షాలపై ఏడుస్తారెందుకంటూ విమర్శలు
  • పోలీస్ ప్రతిష్ఠను తాకట్టు పెట్టారని వ్యాఖ్యలు
  • దిశ చట్టంపై సీఎంకు అవగాహన కల్పించాలని హితవు
Nara Lokesh fires on AP DGP

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సవాంగ్ గారూ... డీజీపీ పదవి కోసం ఇంతగా దిగజారిపోవాలా? అంటూ ప్రశ్నించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్న జగన్ ను వదిలేసి, విపక్షాలపై ఏడుస్తారెందుకని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను తాడేపల్లి ప్యాలెస్ కు తాకట్టు పెట్టడం మీ కెరీర్ లో మాయనిమచ్చలా మిగిలిపోతుందని అన్నారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఏంచర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే ఇప్పటివరకు సమాధానం లేదని తెలిపారు. సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా? అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారని లోకేశ్ ఆరోపించారు. మంత్రులు, శాసనసభ్యుల కామక్రీడలకు బలైపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే నీళ్లు నములుతారేంటి సార్? అని నిలదీశారు.

"మీరు షాడో హోంమంత్రి సజ్జల వద్ద పనిచేస్తున్న గుమాస్తా కాదు... రాష్ట్ర డీజీపీ అని గుర్తుంచుకోండి. దిశ చట్టం ఇంకా చట్టబద్ధం కాలేదని సీఎంకు, మంత్రులకు అవగాహన కల్పించండి. వారంతా నిందితులకు ఉరిశిక్ష వేసేశాం అని పగటి కలలు కంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

More Telugu News