Tollywood: షూటింగులో గుర్రం మృతి.. సినీ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు

  • గత నెలలో హైదరాబాద్ లో 'పొన్నియన్ సెల్వం' సినిమా షూటింగ్
  • షూటింగ్ లో పాల్గొన్న గుర్రం డీహైడ్రేషన్ తో మృతి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పెటా ప్రతినిధులు
Police case filed against Director Mani Ratnam

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం 'పొన్నియన్ సెల్వం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తున్న ఓ గుర్రం మరణించింది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. దీంతో మణిరత్నంతో పాటు గుర్రం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీఏ చట్టం, 1960 సెక్షన్ 11, 1860 ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దీనిపై గుర్రం యజమాని స్పందిస్తూ... డీహైడ్రేట్ అయిన గుర్రాలను షూటింగ్ లో ఉపయోగించారని... ఈ కారణంగా గుర్రం చనిపోయిందని చెప్పారు. మరోవైపు పెటా ప్రతినిధులు మాట్లాడుతూ, జంతువులను ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ను వాడాలని చెప్పారు. ఇప్పుడు మనకు టెక్నాలజీ అందుబాటులో ఉందని తెలిపారు.

గత నెల హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ జరిగింది. యుద్ధం సీన్ కోసం ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఈ క్రమంలో డీహైడ్రేషన్ కు గురైన గుర్రం మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పెటా ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలావుంచితే, ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, విక్రమ్, కార్తి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More Telugu News